సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టిన ఆశ వర్కర్లు
మహబూబాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): సమస్యల పరిష్కారం, నెలకు కనీస వేతనం 18 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ తో ఆశా కార్యకర్తలు పోరుబాట పట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తమ సమస్యల పరిష్కారం కోసం హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి చూపడం లేదని ఆశ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాము తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు చేపట్టిన నిరసన కార్యక్రమాలను కూడా అడ్డుకుంటూ అక్రమంగా అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మండల, డివిజన్ కేంద్రాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కేసముద్రం, కంబాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో కోమల, మల్లీశ్వరి, సుజాత, నాగమణి, పద్మ, కరుణ, సునీత, రజని, సుకన్య, సావిత్రి, విజయ, రమ్య, సులోచన, సైదమ్మ, యాకలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
మరిపెడలో..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని, సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని, ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు క్షేత్రస్థాయిలో పాటుపడుతున్న ఆశా కార్యకర్తల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహించడం సరికాదని మాజీ ఎమ్మెల్యే డీ ఎస్ రెడ్యా నాయక్ అన్నారు. మరిపెడ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు.




