calender_icon.png 25 June, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నతల్లిని కడతేర్చిన కసాయి కూతురు

24-06-2025 11:11:18 PM

ప్రియుడు, అతని సోదరుడితో కలిసి హత్యకు పాల్పడిన ఘటన..

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): తన ప్రేమకు అడ్డు పడుతుందని కన్నతల్లిని కూతురు కిరాతకంగా హత్య చేసిన విషాద ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్(Jeedimetla Police Station) పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఎనిమిది నెలల క్రితం తేజశ్రీ(16)కి నల్లగొండకు చెందిన పగిళ్ల శివ(19)తో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లి అంజలి పదవ తరగతికే ప్రేమ వ్యవహారం ఏంటని ప్రశ్నించడంతో వారం రోజుల క్రితం బాలిక శివతో వెళ్ళిపోయింది. అంజలి ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. అనంతరం ప్రియుడు శివ తేజశ్రీని పోలీసులకు అప్పగించాడు. దీంతో పోలీసులు శివకు నోటీసులు ఇచ్చి పంపించారు. అయితే తన ప్రేమకు తల్లి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు శివ, అతడి సోదరుడు యశ్వంత్ (18) తో కలిసి అంజలిని హత్య చేయాలని ప్లాన్ చేశారు.

సుత్తితో తలపై కొట్టి, కత్తితో మెడ కోసి...

ప్రియుడు శివ, యశ్వంత్ సోమవారం సాయంత్రం నల్గొండ నుంచి జీడిమెట్లకు వచ్చారు. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా శివ యశ్వంత్ సహాయంతో వెనుక నుండి చున్నీతో మెడను బిగించి హతమార్చాలని ప్రయత్నించారు. అయినా అంజలి ప్రాణం పోకపోవడంతో తేజశ్రీ సుత్తితో అంజలి తలపై పలుమార్లు బలంగా కొట్టింది. శివ సోదరుడు కత్తితో అంజలి గొంతు కోసి హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. చనిపోయిన అంజలి చాకలి ఇల్లమ్మ మునిమనువరాలు.