108 అంబులెన్స్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆడిట్ సూపర్వైజర్
దమ్మపేట,(విజయక్రాంతి): మండల 108 అంబులెన్స్ సేవలను జీవీకే ఈఎంఆర్ఐ (GVK EMRI) గ్రీన్ హెల్త్ సర్వీస్ హైదరాబాద్ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన ఆడిట్ సూపర్వైజర్ కిషోర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్లో ఉన్న మెడికల్ పరికరాల పనితీరు, మందుల నిల్వలు, వాటి గడువు తేదీలు, నిర్వహణ రికార్డులు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అత్యవసర కేసుల నిర్వహణ విధానం, సేవల సమయపాలన, సిబ్బంది పనితీరును కూడా సమీక్షించారు.
మందుల నిర్వహణ సక్రమంగా ఉండటం, మెడికల్ పరికరాలు సమర్థంగా పనిచేయడం పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది విధి నిర్వహణను మెచ్చుకుని, ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ తనిఖీ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 108 మేనేజర్ మనోహర్, ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్ పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) రాము, వాహన చోదకుడు పైలెట్ లాల్సింగ్ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు.




