16-05-2025 11:08:57 PM
మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలి
కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి
ఎల్బీనగర్: మన్సూరాబాద్ పెద్ద చెరువులో మురుగునీరు కలవకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాని కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి కోరారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి మన్సూరాబాద్ పెద్ద చెరువులోకి మురుగునీరు చేరుతుందని తెలుసుకుని పరిశీలించారు. చెరువులోకి మురుగునీరు చేరుతుందని జలమండలి అధికారులకు కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి సమాచారం ఇచ్చారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... ఏడేండ్ల క్రితం చింతలకుంట అండర్ పాస్ రోడ్డులో వర్షపు నీరు నిల్వకుండా ప్రత్యేకంగా ఎస్ఎన్ ఆర్ అపార్ట్మెంట్ రోడ్డు మార్గం నుంచి పెద్ద చెరువులోకి వర్షపు నీటి పైప్ లైన్ వేశారని, ఈ పైప్ లైన్ కు సివరేజ్ లైన్లు కనెక్షన్ చేశారని తెలిపారు. సీవరేజ్ పైప్ లైన్లు కనెక్షన్ ఇచ్చినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మన్సూరాబాద్ పెద్ద చెరువు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు శేఖర్ రెడ్డి, వేమన్ రెడ్డి, జైపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు మొరిశెట్టి సంతోష్, కవితా రెడ్డి పాల్గొన్నారు.