టైరు పంచర్తో ఆటో బోల్తా.. మహిళకు తీవ్ర గాయాలు
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం సాయన్నపేట మూలమలుపు వద్ద శనివారం ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. సింగరేణి మండలం కొత్తగూడెం నుంచి టేకులపల్లి వారాంతపు సంతకు కూరగాయలు తీసుకుని వస్తుండగా ఆటో టైరు పంచర్ కావడంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాద సమయంలో ఆటోలో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.
ఈ ప్రమాదంలో అజ్మీర పద్మ (40), భర్త కృష్ణకు నడుము భాగం, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే టేకులపల్లి 108 అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకుంది. ఈఎంటి సునీత, పైలెట్ నాగేశ్వరరావు క్షతగాత్రురాలికి ప్రథమ చికిత్స అందించి, అనంతరం ఇల్లందు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్పందించి క్షతగాత్రురాలిని సకాలంలో ఆస్పత్రికి తరలించిన 108 అత్యవసర సేవల సిబ్బందిని స్థానికులు అభినందించారు.






