ఆటో కార్మికుల సమ్మె విరమణ
- ఆటో కార్మిక సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు సఫలం
- ఆటో చార్జీల పెంపుపై కమిటీ
హైదరాబాద్, ఆగస్టు 23(విజయక్రాంతి): ఆటో కార్మిక సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు ఆదివారం సఫలం అయ్యాయి. ఆటోకార్మికుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి తలపెట్టిన ఆటో కార్మికుల సమ్మెను విరమించామని జేఏసీ నేతలు తెలిపారు. దీంతో వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ పక్షాన ఈవీ ఆటోలు కొనే ప్రసక్తే లేదని, అదంతా దుష్ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు.
ఆర్టీసీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. విధివిధానాలకు సెప్టెంబర్ 1 మళ్లీ కార్మికశాఖ, రవాణాశాఖ, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. 2012 తర్వాత ఆటో చార్జీలు పెంచలేదు. కాబట్టి ఆటో చార్జీలు పెంచడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఎంత పెంచాలి అనే దానిపై తగిన నివేదిక తీసుకొని, సంబంధిత జీవో విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఓలా, ఉబెర్ మాదిరి ప్రభుత్వం తరుఫున యాప్నకు ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు.






