పరిశోధనల ప్రోత్సాహానికి అవార్డులు!
వర్సిటీల్లో కొత్తగా డిజిటల్ క్లస్టర్లు ఏర్పాటు
వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్ బీ క్యాటగిరీ సీట్లకు ఆన్లైన్ కౌన్సెలింగ్
తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): యూనివర్సిటీల్లో పరిశోధనలను ప్రోత్సహించేలా ప్రొఫెసర్లకు అవార్డులు ప్రదానం చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్గా బాధ్యతలు తీసుకొని ఏడాది పూర్తయిన సందర్భంగా ఉన్నత విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలతోపాటు భవిష్యత్లో చేపట్టే కార్యక్రమాల గురించి శని వారం ఉన్నత విద్య మండలి కార్యాలయంలో మీడియాకు ఆయన వివరించారు.
యూనివర్సిటీలను అనుసంధానం చేసి డిజిటల్ విద్యను విద్యార్థులకు చేరువ చేసేందుకు తెలంగాణ డిజిటల్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఏడాది పాలనలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశామని, ఎప్సెట్లో మాక్ కౌన్సిలింగ్ చేపట్టామని, దోస్త్ స్పాట్ అడ్మిషన్లను ప్రభుత్వ కాలేజీల్లోనూ చేపట్టామని వివరించారు. విద్యార్థుల కోసం సులువైన పద్ధతుల్లో ఆంగ్లం నేర్చుకునేందుకు వీలుగా ఇంగ్లిష్ మెటీరియల్ను రూపొందించామన్నారు.
ఉన్నత విద్యా మండలి వెబ్సైట్లో దీనిని పొందుపరిచామని విద్యార్థులు వాటిని తమ ఈ-మెయిల్ ద్వారా వినియోగించుకోవచ్చని తెలిపారు. వర్సిటీలు దీన్ని సిలబస్లో చేర్చుకోవచ్చని వెల్లడించారు. డిగ్రీ సీట్లను రేషనలైజేషన్ చేస్తామని, వచ్చే విద్యాసంవత్సరంలో బీ-కేటగిరీ సీట్లను ఆన్లైన్లో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
పీజీలోనూ అనవసరమైన సిలబస్ను తొలగించి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నూతన సిలబస్ను తీసుకొస్తామన్నారు. అలాగే విద్యా వ్యవస్థలో ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గవర్నింగ్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఇంగ్లిష్ మెటీరియల్ పుస్తకాన్ని అధికారులతో కలిసి బాలకిష్టారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్-1 ప్రొఫెసర్ పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ పాల్గొన్నారు.




