19-10-2025 12:36:22 AM
సంగారెడ్డి, అక్టోబర్ 18 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా ఆందోల్ శివారులో కటకం వేణుగోపాల్ అనే వ్యక్తికి చెందిన పటాకుల హోల్సేల్ గోదాం వద్ద శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద పెద్ద శబ్దాలతో టపాసులు పేలిపోయి మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడిన మంటలతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకొన్న జోగిపేట ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు.
గోదాం లో తగిన జాగ్రత్తలు లేనందున ఈ అగ్నిప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలుసు కోవడానికి పోలీసు బృందం దర్యాప్తు చేస్తుందని, సంగారెడ్డి జిల్లాలో పటాకుల దుకాణంలో పలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఇదివరకే జిల్లా ఎస్పీ హెచ్చరించిన విషయం తెలిసిం దే. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని త్వరలోనే తేలుస్తామని జోగిపేట ఎస్ఐ పాండు తెలిపారు.