మల్లాపూర్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మేజర్ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కిరాణా షాపులు, హోటళ్లు, ఇతర దుకాణాలను సందర్శించి ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను వ్యాపారులకు వివరించారు. ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించి గ్రామపంచాయతీకి సహకరించాలని షాప్ యజమానులు, హోటల్ నిర్వాహకులను కోరారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ... ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా ప్లాస్టిక్ రహిత గ్రామాన్ని సాధించవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా కాగితం, జూట్, బట్ట సంచులను వినియోగించాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సోమ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు ముష్కరి రమేష్, భూక్యా శేఖర్, అల్లె చంద్రయ్య, కదుర్కా రాజేందర్, కాశవత్తుల గంగా రెడ్డి, అరికుప్పల రాజం, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




