11 April, 2026 | 9:07 PM

డ్రగ్స్ తో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి

11-04-2026 07:26 PM

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో ఆరోగ్య వారోత్సవాలు ముగింపు

మెడికల్ కాలేజీలో ఫ్లాష్ మాబ్

ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన

వైద్య కళాశాల పనుల పరిశీలన

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): డ్రగ్స్ తో కలిగే నష్టాలపై యువత, విద్యార్థులకు వైద్యులు, వైద్య విద్యార్థులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ఆరోగ్య వారోత్సవాల ముగింపు సందర్భంగా సిరిసిల్ల పరిధిలోని వైద్య కళాశాలలో డ్రగ్స్ నియంత్రణ, డ్రగ్స్ తో కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

డ్రగ్స్ తో కలిగే నష్టాలపై వైద్య విద్యార్థులు ఫ్లాష్ మాబ్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక  కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు  ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. ఆరు రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందించామని తెలిపారు.

టీబీ ముక్త్ భారత్ లో భాగంగా జిల్లాకు వచ్చిన మొబైల్ ఎక్స్ రే యంత్రం ప్రారంభించామని, నిర్దేశిత గ్రామాల్లో పరీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు. హెచ్పీవీ వ్యాక్సిన్ వేస్తున్నారని వివరించారు. యోగా తో ఉపయోగాలు తెలియజేసేందుకు సిరిసిల్లలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. వైద్యుల సలహా సూచనలకు అందరూ ఎంతో విలువ ఇస్తారని, ప్రతి డాక్టర్ తమ వద్దకు వచ్చే వారికి ఆరోగ్య సలహాలు ఇవ్వాలని, వైద్య విద్యార్థులు యువత, విద్యార్థులకు డ్రగ్స్ తో కలిగే నష్టాలు, భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుత మంచి అలవాట్లు, ఆహారంపై శ్రద్ధ భవిష్యత్ కు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ను సన్మానించారు.

వైద్య కళాశాల పనులు గడువులోగా పూర్తి చేయాలి

వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు ప్రభుత్వ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వైద్య కళాశాల భవనం, బాలుర, బాలిక హాస్టళ్లు, మెస్ ఇతర పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి.. వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ సీఈ రాజేశ్వరరెడ్డి, ఈఈ నరసింహాచారి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జున చక్రవర్తి, జీజీ హెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, ఆర్ఎంఓ సంతోష్ కుమార్, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు ఉన్నారు.