07-11-2025 08:08:32 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు ఉన్నత పాఠశాలలో బోడు పోలీసుల ఆధ్వర్యంలో ఎస్సై పీ.శ్రీనివాసరెడ్డి, సిబ్బంది విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలనపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించచారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చైతన్యం – డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా బోడు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గంజాయితో పాటు ఇతర మత్తు పదార్ధాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలను సేవిస్తే శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా, సమాజ పరంగా ఎదురయ్యే సమస్యలు, చట్టాల ద్వారా పడే శిక్షలను వివరించారు.
అసాంఘిక కార్యకలాపాలు గానీ, వ్యక్తుల సమాచారం గానీ, తెలిస్తే స్థానిక పోలీసులకు గానీ, 100 నంబర్కు డయల్ చేసి తెలుపాలన్నారు. జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్న పోలీస్ శాఖకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఫోక్సో చట్టాల పై అవగాహన కల్పించారు. చెడు మార్గాలలో నడవకుండా మంచిగా చదువు కొని ఉన్నత స్థాయికి ఎదగాలి అని వారికి చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, బోడు పాఠశాల హెచ్ ఎం జగన్,, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.