23-01-2026 12:00:00 AM
కామారెడ్డి అర్బన్, జనవరి 22 (విజయక్రాంతి): జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు2026ను పురస్కరించుకొని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని పలు పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలో రహదారి భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు సోషల్ వెల్ఫేర్ పాఠశాల మరియు జూనియర్ కళాశాల దోమకొండలో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారులు ఇర్షాద్, శంకర్ మరియు రఫీ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని తెలిపారు.
పాదచారులుగా, బస్సులు మరియు ఇతర వాహనాలలో ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సరళమైన భాషలో విద్యార్థులకు వివరించారు. అలాగే రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే గుడ్ సమారిటన్లకు ప్రభుత్వం కల్పిస్తున్న చట్టపరమైన రక్షణలు మరియు ప్రోత్సాహకాలను విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. చిన్న వయసులోనే రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు. సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.