09-06-2025 06:53:21 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలం రైతులకు నానో యూరియా వినియోగం, ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు. మండలంలోని గుడిపల్లి గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నానో యూరియా వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి(Mandal Agricultural Extension Officer Mutyam Tirupati) మాట్లాడారు. నానో యూరియా సాధారణ యూరియా బస్తాతో పోల్చినట్లయితే తక్కువ పరిమాణం కలిగి అంతే స్థాయి పోషకాలను అందిస్తుందన్నారు.
తక్కువ ధరలో ఎక్కువ పోషకాల లభ్యతతో పాటు పొలానికి అందించడానికి సులువుగా ఉంటుందని, నానో యూరియా ద్రవ రూపంలో ఉండి పైపాటుగా పంటపై పిచికారి చేయటం ద్వారా తక్కువ ఖర్చుతో పాటు సమయం ఆదా అవుతుందన్నారు. అంతే కాకుండా పర్యావరణ హితంగా ఉండి భూగర్భ జల కాలుష్యం తగ్గుతుందన్నారు. రాబోవు రోజుల్లో యూరియా కొరతను అధిగమించడానికి నానో యూరియా ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని సూచించారు. నానో యూరియా నిదానంగా మొక్కకు అందుతూ శాఖీయ ఎదుగుదలకు తోడ్పడు తుందని, తద్వారా అధిక వినియోగానికి, దిగుబడులకు తోడ్పాటు అందిస్తుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రైతు లందరూ నానో యూరియా వినియోగానికై మొగ్గు చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి సైన్ల కనకరాజు, రైతులు పాల్గొన్నారు.