ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం
కూకట్ పల్లి, జూన్ 25 (విజయక్రాంతి): నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ పై నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ నాయకులకు సూచించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శ్రీ హేమదుర్గ భవన్ లో నాయకులకు ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ఎస్ ఐ ఆర్ పై నాయకులకు, కార్యకర్తలకు పలు సూచనలు సలహాలు అందజేశారు. ఎన్నికల జాబితా సవరణపై నాయకులు అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. ఈ విషయంలో నాయకులు, కార్యకర్తలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మీ మీ డివిజన్లలో ప్రతి వ్యక్తి ఓటు నమోదయ్యేలా చూడాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అద్యక్షులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.






