13 April, 2026 | 3:54 PM

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

13-04-2026 02:10 PM

అరైవ్ అలైవ్ పై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు 

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్ కార్యక్రమాలను  నిర్వహిస్తున్నామని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక భాగంగా నిర్వహిస్తోన్న అరైవ్ - అలైవ్  కార్యక్రమాన్ని కల్వకుర్తి  మండలం తర్మికల్ గ్రామపంచాయతీలో సోమవారం   నిర్వహించారు. ఈ, సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు భద్రత సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని  తెలిపారు. గ్రామ సర్పంచ్ వరలక్ష్మి స్వంత నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. గ్రామ భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణలో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

నేటి నుండి ఈ నెల 18వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల భద్రత, సంక్షేమమే లక్ష్యంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో సర్పంచులు, యువత, అధికారులు కలిసి రోడ్డు ప్రమాదాల నియంత్రణలో చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలు కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు.

పాదచారులు కూడా జాగ్రత్తగా రోడ్లు దాటాలని, నిర్దేశిత జీబ్రా క్రాసింగ్‌లను వినియోగించాలని చెప్పారు.  గుడుంబా, గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. రోడ్డు భద్రతపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించే గోడపత్రికను ఆవిష్కరించారు.  అదనపు ఎస్పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... జిల్లా పోలీస్ శాఖ నుండి ప్రమాదాల నివారణపై అరైవ్ అలైవ్ కార్యక్రమాలతో ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీవో చిన్న బాలు, గ్రామ సర్పంచి వరలక్ష్మి, కల్వకుర్తి , డీఎస్పీ వెంకట్ రెడ్డి తాహసిల్దార్ ఇబ్రహీం , తదితరులు పాల్గొన్నారు.