01-11-2025 05:28:15 PM
ఉద్గమ్ పోర్టల్ ప్రాధాన్యత వివరించాలి..
కలెక్టర్ పమేలా సత్పతి..
ముకరంపురా (విజయక్రాంతి): దీర్ఘకాలంగా క్లెయిమ్ చేయని ఆస్తులు(బ్యాంకు డిపాజిట్లు, బీమా, పీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు) ను క్లెయిమ్ చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి బ్యాంకు, భీమా, ఆర్థిక సంస్థల ప్రతినిధులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో బ్యాంకు, బీమా, నియంత్రణ సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. బ్యాంకు ఖాతా ప్రారంభించేటప్పుడు అన్ని వివరాలు పూర్తిగా నింపి.. నామినీ వివరాలు తప్పనిసరిగా రాయాలన్నారు. పలువురు ఉద్యోగ, ఉపాధి రీత్య వివిధ ప్రాంతాల్లో నివసించినప్పుడు వివిధ ఆర్థిక సంస్థల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్లు.. క్లైమ్ చేయకుండా వదిలేశారన్నారు. దీంతో వారి అడ్రస్, కుటుంబసభ్యుల వివరాలు తెలియక ఖాతాల్లోనే సొమ్ము ఉండిపోయిందన్నారు. ఆధార్, ఫోన్ వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు.
దేశవ్యాప్తంగా క్లైమ్ చేయని ఆస్తులు రెండు లక్షల కోట్లు ఉందని.. వీటిని అర్హులైన పౌరులకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉడగం పోర్టల్ ను ప్రవేశపెట్టిందన్నారు. గుజరాత్ లో అక్టోబర్ 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మీ డబ్బు మీ హక్కు అనే నినాదంతో దీనిని ప్రారంభించారన్నారు. సంబంధిత బ్యాంకులు, సంస్థల వద్దకు వెళ్లి మీ వద్ద ఉన్న సరైన పత్రాలు సమర్పించి నగదు పొందాలని సూచించారు. డిసెంబర్ 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని.. గ్రామాల వారీగా స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఈ కార్యక్రమం గురించి వివరించాలని పేర్కొన్నారు. ఎవరైనా వివరాలు సమర్పిస్తే యాక్టివేట్ చేసి జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ప్రతినిధులను ఆదేశించారు. నగర పాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ.. క్లీన్ చేయని డిపాజిట్లు, బీమా, పీఎఫ్ వంటి వాటపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
కేవైసీ, ఫోన్ నెంబర్, అడ్రస్, అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ముందు చూపుతో ఆలోచిస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు. డీజీఎం సోలంకి మాట్లాడుతూ కలెక్టర్ చొరవతో రెండు నెలల్లో కొన్ని ఖాతాలను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ చైర్మన్ శ్రీహరి మాట్లాడుతూ.. క్లైమ్ చేయని ఆస్తులను అర్హులకు అప్పగించాలనే ఉద్దేశంతో 90 రోజుల క్యాంపెయిన్ ను జిల్లాల వారీగా ప్రారంభించినట్లు వివరించారు. మీ వద్ద ఉన్న వివరాలతో బ్రాంచ్ కి వెళ్లి తెలుసుకోవాలని సూచించారు. యూబీఐ డీజీఎం అపర్ణ రెడ్డి మాట్లాడుతూ క్లైమ్ చేయని ఖాతాదారులను కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్ మాట్లాడుతూ.. నామినీ పేరు నమోదు చేయకపోవడంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై మరింత అవగాహన పెంచాలన్నారు. ఈ సందర్భంగా ఆవరణలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. పలువురికి సెటిల్మెంట్ లెటర్లు అందజేశారు.