10-06-2025 09:45:32 PM
పాపన్నపేట: రైతులు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంపొందించుకొని ఆ దిశగా పంటలను పండించేందుకు కృషి చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు(Agricultural Scientists) పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్(Viksit Krishi Sankalp Abhiyan) కార్యక్రమంలో భాగంగా వరి పరిశోధన సంస్థ, కృషి విజ్ఞాన కేంద్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి పంటకు ముందు మట్టి నమూనా పరీక్షలను నిర్వహించుకొని భూసార పరీక్షల ఫలితాల ద్వారా తగిన మోతాదులో ఎరువులను వాడితే దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతో పాటు ప్రకృతి, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించినటువంటి మెలకువలు నేర్చుకొవడము ద్వారా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించే అవకాశం ఉందన్నారు. ఈ పద్ధతుల వలన వారికి, ఇతర పంటలకు కీటకాల, ఇతర తెగుల నివారణ జరుగుతుందన్నారు. నూతన వంగడాలు, కాండం తొలిచి పురుగు, అగ్గి తెగుల నివారణ వంటివి తమ పంటలలో సోకితే ఇలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అనే వాటిపై రైతులకు శాస్త్రవేత్తలు వివరించారు.
శాస్త్రీయ పద్ధతులను అనుసరించుతూ వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ రైతులు వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేంద్ర కుమార్, డాక్టర్ ఎమ్మెస్ ప్రసాద్, డాక్టర్ సాయిప్రసాద్, డాక్టర్ చిన్నబాబు, డాక్టర్ రవికుమార్, ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ అంబికా సోని, ఎడిఏ విజయనిర్మల, ఏవో నాగ మాధురి, ఏఈఓలు అభిలాష్, జనార్దన్, రజితతో పాటు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పబ్బతి ప్రభాకర్ రెడ్డితో పాటు గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.