calender_icon.png 11 January, 2026 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్‌కు ఆయుష్!

10-01-2026 12:03:01 AM

  1. పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసిన కేంద్రం

ఫలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ క్రుషి

రూ.15 కోట్లతో 50 పడకల ఆసుపత్రికి కేంద్రం ఆమోదం

రూ.7.5 కోట్ల నిధులు విడుదల

ఆయుష్ సేవల్లో ఉత్తర తెలంగాణకు కీలకం కానున్న కరీంనగర్

కరీంనగర్, జనవరి 9(విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు శుభవార్త. ఈ ప్రాంతానికి ఆయుష్ (ఆయుర్వేదం, యోగా నేచురోపతి, యునాని, సిద్ద, హోమియోపతి) ఆసుపత్రి రాబోతోంది.  కరీంనగర్ లో 50 పడకల ‘ఆయుష్’ ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అల్లోపతి మందులతో సైడ్ ఎఫెకట్స్ ఉండే అవకాశాలుండటంతో ఈ ప్రాంత ప్రజలు గత కొంత కాలంగా ఆయుర్వేదం, హోమియోపతి చికిత్సవైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కాలంలో వీటికి ఆదరణ కూడా బాగా పెరిగిపోయింది.

దీనిని ద్రుష్టిలో ఉంచుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ‘ఆయుష్’ ఆసుపత్రి ఏర్పాటు కోసం క్రుషి చేస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపి కేంద్రానికి పంపించారు. ఉన్నతాధికారులతోపాటు కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ ను కలిసి కరీంనగర్ లో ఆయుష్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందించారు. 

తెలంగాణలో వికారాబాద్, సిద్దిపేట, భూపాపల్లి జిల్లాల్లో ఇప్పటికే ఆయుష్ ఆసుపత్రులు ఉన్నాయి. అయినప్పటికీ  బండి సంజయ్ విజ్ఝప్తి మేరకు కరీంనగర్ లో ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఆయుష్ విభాగం అధికారులు పరిశీలించారు. ఉత్తర తెలంగాణలో ఆయుష్ సేవల పట్ల ప్రజలు మక్కువ చూపుతున్నట్లు తేలడంతో కరీంనగర్ లో ‘ఆయుష్’ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

అందులో భాగంగా 50 పడకల ఆయుష్ ఆసుపత్రిని మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆసుపత్రి ఏర్పాటుకు మొత్తం రూ.15 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అందులో భాగంగా రూ.7.5 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తక్షణమే ‘ఆయుష్’ ఏర్పాటు కోసం తగిన స్థలాన్ని ఎంపిక చేసి ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది.

స్థల ఎంపిక ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుతోపాటు డాక్టర్లు, సిబ్బందిని నియామక బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. కేంద్రం ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆయుష్ అధికారులతో చర్చించారు. స్థల సేకరణపై ద్రుష్టి సారించారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతీయ సాంప్రదాయ వైద్య చికిత్సలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా యోగా, ఆయుర్వేదం, హోమియోపతి వైద్యంపట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తొంది. ఈ చికిత్సలవల్ల పెద్దగా సైడ్ ఎఫెకట్స్ లేకపోవడంతో ప్రజలు సైతం వీటివైపు మొగ్గు చూపుతున్నారు.

బండి  సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంలో పలుమార్లు ప్రజలు ‘ఆయుష్’ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రాలు అందించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకుని ఆయుష్ ఆసుపత్రి కోసం క్రుషి చేశారు. సంజయ్ విజ్ఝప్తిని ద్రుష్టిలో ఉంచుకుని తాజాగా కేంద్రం ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం తెలపడంతోపాటు నిధులు కూడా మంజూరు చేయడం గమనార్హం.

ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటైతే ఆయుర్వేద, హోమియోపతి, యోగా నేచురోపతి, యునాని, సిద్ద వైద్య చికిత్స సేవలన్నీ అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు ప్రసూతి, స్త్రీ రోగ చికిత్సలు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు కాయకల్ప చికిత్స, పంచకర్మ,శల్య, శాలాక్య వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి.

మొత్తం 50 పడకల ఆసుపత్రిలో కాయచికిత్సకు 20, పంచకర్మ చికీత్సకు 10, శల్య సేవలకు 10, ఈఎన్టీ, ప్రసూతి, స్ట్రీ ఆరోగ్య సేవలకు 5 పడకలను కేటాయించనున్నారు. ప్రతి విభాగానికి అర్హత, అనుభవం ఉన్న ఆయుష్ వైద్యులు అందుబాటులో ఉంటారు. యోగా ట్రైనర్ కూడా ఉంటారు. పరిపాలన విషయానికొస్తే మెడికల్ సూపరింటెండెంట్ తోపాటు  ఇద్దరు డిప్యూటీ/అసిస్టెంట్ డైరెక్టర్స్ (అడ్మిన్, ఫైనాన్స్) ,

ఇద్దరు హెడ్ క్లరక్స్, ఇద్దరు యూడీసీలు, 7 గురు ఎల్డీసీలు, 14 మంది నర్సింగ్ స్టాఫ్, ఇద్దరు నర్సులతోపాటు ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, ఫార్మాసిస్టులు కూడా ఈ ఆయుష్ ఆసుపత్రలో సేవలందిస్తారు. పంచకర్మ చికిత్సలకు ప్రత్యేక సిబ్బంది అందుబాటులో ఉంటారు.  అట్లాగే ఆయుష్ ఆసుపత్రిలో హౌస్కీపింగ్, లాండ్రీ, ఎలక్ట్రిషియన్, ప్లంబర్, గార్డెనర్ తోపాటు 21 మంది సెక్యూరిటీ సిబ్బంది కూడా సేవలు అందిస్తారు.