08-06-2025 12:48:49 AM
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ను రాష్ట్రవ్యాప్తంగా శనివారం ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బక్రీద్ సందర్భంగా హైదరాబాద్తోపాటు గ్రామాలు, పట్టణాల్లోని మసీదులు, ఈద్గాలకు తెల్లవారుజాము నుంచే క్యూకట్టారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈద్గా వద్ద వినిపిస్తున్న ఖవ్వాలిని వీక్షించారు. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం బక్రీద్ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. త్యాగానికి ప్రతీకగా ముస్లింలందరూ ‘ఈద్ ఉల్ అద్హా’ అనే పండుగను బక్రీద్ పేరిట జరుపుకుంటారు. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే మూగజీవి. ఈద్ అంటే పండుగ అని అర్థం.రాగద్వేషాలను వదిలేసి మానవతను వ్యాప్తి చేయాలన్నదే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశం.
అందుకే బక్రీద్ సందర్భంగా ముస్లిలు ఖుర్బానీ ఇచ్చారు. పేద ముస్లింలకు విరివిగా దానధర్మాలు చేశారు. ఇళ్లలో మటన్ బిర్యానీ, మటన్ కుర్మా, మటన్ కీమా, షీర్ కుర్మా, కీర్ లాంటి వంటకాలను తయారు చేసుకుని ఆరగించారు. కాగా రాష్ట్రంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘాను కొనసాగించారు.