calender_icon.png 16 June, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20న ఏపీ, తెలంగాణలో బంద్ పాటించాలి

16-06-2025 01:38:43 AM

మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘ఆపరేషన్ కగార్’కు నిరసనగా ఈ నెల 20న తెలంగాణ, ఏపీలో బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ఆదివారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఎన్‌కౌంటర్ల పేరుతో పార్టీకి చెందిన అగ్రనేతలను పొట్టనపెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. మావోయిస్టు ఉద్యమ ప్రాంతాల్లో తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తూ, హత్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.

అటవీ సంపదను, ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్‌కౌంటర్ల నాటకమాడుతున్నదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ ఫాసిస్ట్ విధానాలతో ఛత్తీస్‌గఢ్ అమాయక ఆదివాసీలు ప్రాణాలుకోల్పోతున్నారని, అం తేగాక ఆపరేషన్ కగార్ పేరుతో 550 మం దికి పైగా మావోయిస్టులను హత్యచేశారని నిప్పులు చెరిగారు.

గత నెల 21న మావోయి స్టు పార్టీ జనరల్ సెక్రటరీ బసవరాజు అలియాస్ నంబాల కేశవరావుతో పా టు మరో 27 మందిని హతమార్చారని ఆరోపించారు. జూన్ 3న ఏడుగురు మావోయిస్టులను బలి తీసుకున్నారని, ఇప్పటికీ ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతాన్ని భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయని, వేలాది మంది భద్రతా దళాలు ఆ ప్రాం తాన్ని మోహరించాయని తెలిపారు.

3న అన్నపూర్ గుట్టలను బలగాలు మోహరించి చుట్టుముట్టి దాడికి పా ల్పడ్డాయని, ఈ క్రమంలో దారి తప్పిపోయిన మావోయిస్టు గౌతమ్‌ను 5వ తేదీన భద్రతా దళాలు హతమార్చాయని ఆరోపించారు. 6, 7వ తేదీల్లో రైనీ అనే నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలిని పొట్టనపెట్టుకున్నారని, ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నానని వేడుకున్నా కనికరించలేదన్నారు.

అలాగే తెలంగాణలోని కుమ్రంభీం -మంచిర్యాల డివిజన్‌కు చెందిన మావోయిస్టు సభ్యులు సంతోశ్, రజని, ఛత్తీస్‌గ ఢ్‌లోని నేషనల్ పార్క్ ఏరియా 2 పీఎల్ సభ్యుడు లాల్సూ, కుడియం మహేశ్‌ను సై తం భద్రతా బలగాలు హత్య చేశాయని ఆరోపించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమపై వరుస దాడులు చేస్తూ, మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని చంపుతూ, మరోవైపు శాంతి చర్చల పేరిట నాటకం ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. దీనిలో భాగంగానే 2004 శాంతి చర్చలకు ప్రతినిధిగా వ్యవహరించిన సుధాకర్‌ను కూడా హత్య చేశాయని ఆరోపించారు.