గ్రామాలలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి
మోతే,(విజయక్రాంతి): గ్రామాలలో నెలకొన్న మౌలిక సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని సిపిఎం మండల కమిటీ సభ్యురాలు జంపాల స్వరాజ్యం డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో ప్రజా సమస్యలపై సిపిఎం పోరు బాటలో భాగంగా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల అవుతున్న గ్రామపంచాయతీకి ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రజలు సమస్యలు చెబుదామనుకుంటే వినేవారు దిక్కులేరన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాల మూలంగా దెబ్బతిన్న వరి పంటకు ఎకరాకు 20వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాల మూలంగా వీధుల్లో నీళ్లు నిలువ ఉండడంతో దోమలు వృద్ధి చెంది ప్రజలు అంటు రోగాలు, విష జ్వరాల బారిన పడుతున్నారని అంటువ్యాధులు, విష జ్వరాల నుండి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే పారిశుద్ధ్య నిధులు విడుదల చేయాలన్నారు.






