calender_icon.png 26 September, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

26-09-2025 12:30:08 AM

  1. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
  2.   27న కార్నివాల్, 28న బైక్, సైకిల్ ర్యాలీలు
  3. నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలి
  4. మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క 

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : ఈ నెల 29న గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా సరూర్ నగర్  స్టేడియంలో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఈ నెల 27న ట్యాంక్ బండ్ పై బతుకమ్మ కార్నివాల్, 28న బైక్, సైకిల్ ర్యాలీలు, 29న సరూర్ నగర్ స్టేడియంలో 10 వేల మంది మహిళలతో బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, 30న ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ కార్యక్రమాలు ఉంటాయని, దీనికి అనుగుణంగా ప్రతిష్ఠాత్మకంగా సన్నాహాలు జరగాలని సూచించారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు చేపట్టాలి.

ట్యాంక్ బండ్ తో పాటు పీవీ మార్గ్, సచివాలయం, సరూర్ నగర్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, మహిళలకు సౌకర్యాలు కల్పించాలని దిశానిర్ధేశం చేశారు. పండగ ప్రాశస్త్యానికి అద్దం పట్టేలా హైదరాబాద్‌లో చారిత్రక ప్రదేశాలతో పాటు ప్రధాన జంక్షన్లను అందమైన ఆకృతులతో, విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు.

పర్యాటక, సాంస్కృతిక,  జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పోలీస్, ట్రాన్స్‌కో ఇతర శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సరూర్ నగరం స్టేడియంలో ఈ నెల 29న 10వేల మంది బతుకమ్మ వేడుకలు, 63 అడుగుల ఎత్తున బతుకమ్మను ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్ రికార్డుల్లో చేర్చేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు సూచించారు.

స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలను తరలించే బాధ్యతను సెర్ఫ్ అధికారులు తీసుకోవాలని, దీనికి తోడు మిగిలిన వారిని తీసుకువచ్చేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, హైదరాబాద్ నగర వాసులు పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని విజయంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.

సమీక్షలో మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభ రాణి, సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.