12-12-2025 02:02:42 AM
- మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి
జగిత్యాల అర్బన్, డిసెంబర్ 11 (విజయ క్రాంతి): బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో చర్చ జరిగేలా తెలంగాణకు చెందిన అన్ని పార్టీల ఎంపీలు కృషి చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆలోచనల కనుగుణంగా విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చట్టం చేసిందన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కాలంటే గతంలో ఉన్న 50 శాతం రిజర్వేషన్ పరిమితి తొలగించాలన్నారు. తమిళ నాడు తరహాలో సామాజికంగా వెనుకబడిన బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్ ల కోసం 9 వ షెడ్యూల్ లో చేర్చాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు 42 శాతం రిజర్వేషన్ అమలుకు అనుకూలమని, చెబుతున్న నేపథ్యంలో రిజర్వేషన్లు అచరణలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.
బలహీన వర్గాల తరపున ఆర్ కృష్ణయ్య చేస్తున్న పోరాటం అభినందనీయమని, అన్ని రాజకీయ పార్టీలను సమన్వయ పరిచి, లోకసభ, రాజ్యసభలో చర్చించే విధంగా ఆర్. కృష్ణయ్య చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల కి మాత్రమే పరిమితమైంది కాదని, విద్యా, ఉద్యోగాల్లో అమలు చేయడం ప్రధానమైన అంశం అన్నారు. శీతాకాల సమావేశాల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం అన్ని రాజకీయ పార్టీలు చొరవ తీసుకోవాలని జీవన్రెడ్డికోరారు.