రాజ్యాంగ బద్ధమైన వాటా కోసం బీసీలు ఉద్యమించాలి
బీసీ పొలిటికల్ ఫ్రెండ్ చైర్మన్ బాలగోని బాలరాజ్
ముషీరాబాద్, మే 8 (విజయక్రాంతి): రాజ్యాంగబద్ధమైన వాటా కోసం బీసీలు ఉద్యమించాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ పిలుపునిచ్చారు. ఓబీసీ వర్గానికి చెందిన ప్రధాన మంత్రి ఓబీసీల పట్ల మీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు.
ఈ మేరకు శుక్రవారం పొలిటికల్ ఫ్రంట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్తో కలిసి మాట్లాడారు. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపి 9వ షెడ్యూల్లో చేర్చి అమలు చేయాలని, జనగణనలో కులగణను లెక్కించాలని, బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ రక్షణచట్టాన్ని తీసుకురావాలని, ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ను పునర్ సమీక్షించాలని, రోహిణి కమీషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ మాట్లాడుతూ కులాల వారీగా బీసీ కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం ఆ కార్పొరేషన్లకు అవసరమైన అధికారాలు, నిధులు, స్వయం నిర్ణయాధికారాన్ని ఇవ్వలేదని ప్రశ్నించారు. చైర్మన్ పదవులను కేవలం పేరుకే పరిమితం చేసి జీతాలు కుర్చీలు వైస్ చైర్మన్ హోదాకు పరిమితం చేయడం దురదుష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ బైరు శేఖర్, పోతగాని ఐలన్గౌడ్, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.






