calender_icon.png 12 January, 2026 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగతనాల నుంచి జాగ్రత్తగా ఉండాలి

12-01-2026 01:26:33 AM

మహబూబాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక మంది తమ స్వగ్రామాలకు వెళ్తున్నారని, తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, దొంగతనాల నుండి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, రాత్రి వేళల్లో గస్తీని మరింత పటిష్టం చేశామని తెలిపారు.

ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు కూడా పోలీసులకు సహకరించి భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. సంక్రాంతికి ఊరెళ్లే వారికి మహబూబాబాద్ జిల్లా పోలీసుల సూచనలు. జిల్లాలోని కాలనీలు, ఇళ్లు, షాపులు, అపార్టుమెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇంట్లో లేని సమయంలో నమ్మకమైన ఇరుగు పొరుగు వారిని ఇంటిని గమనించమని చెప్పాలన్నారు.

విలువైన వస్తువులను, ద్విచక్ర వాహనాల డిక్కీలు లేదా కార్లలో వదిలివేయరాదన్నారు. వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలని, రోడ్లపై నిలపరాదన్నారు. బీరువా తాళాలను ఇంట్లో ఉంచకుండా వింత తీసుకెళ్లాలన్నారు. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలని, గేటుకు తాళం వేసి ఉన్న ఇళ్లలోనే దొంగలు పడే అవకాశం ఎక్కువ ఉందన్నారు. ఊర్లకు వెళ్లేవారు ఇంట్లో ఒక గదిలో లైట్ వెలిగించి ఉంచడం మంచిదని, ఇంటి ముందు చెత్త, పత్రికలు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా చూడాలన్నారు. పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలన్నారు.

విలువైన వస్తువులు, ఆర్థిక విషయాలను ఇతరులతో పంచుకోవద్దన్నారు. వాహనాలకు హ్యాండిల్ లాక్తో పాటు వీల్ లాక్ తప్పనిసరిగా వేయాలన్నారు..ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవడం ఉత్తమమని చెప్పారు. టైమర్తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవచ్చన్నారు. ఇంటి ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాకింగ్ లేదా నాణ్యమైన సెక్యూరిటీ లాక్ వాడాలన్నారు. సీసీ కెమెరాలను ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలించాలని, డీవీఆర్ను రహస్య ప్రదేశంలో ఉంచాలన్నారు..హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా మొబైల్ నుంచే ఇంటిని ప్రత్యక్షంగా చూడవచ్చన్నారు. దృఢమైన తలుపులు, నాణ్యమైన గ్రిల్స్తో రెండంచెల భద్రత ఏర్పాటు చేసుకోవాలని, కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.

ప్రజలు పోలీస్ గస్తీకి సహకరించాలని, బీట్ కానిస్టేబుల్ నంబర్ దగ్గర ఉంచుకోవాలన్నారు. అనుమానితుల కదలికలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని, ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు. కాలనీవాళ్లు కమిటీలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, వాచ్మెన్లను ఏర్పాటు చేసుకోవాలన, అపార్టుమెంట్లలో కొత్తవారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. సోషల్ మీడియాలో మీ ప్రయాణ వివరాలు షేర్ చేయకపోవడం మంచిదని, దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ చిరునామా, ఫోన్ నంబర్ను పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని,  అనుమానాస్పద కదలికలపై డయల్ 100 లేదా మీ సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.