12-01-2026 01:24:49 AM
తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగింత
ములుగు ,మేడారం,జనవరి11(విజయక్రాంతి): ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరు గాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతరలో మంత్రి సీతక్క మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. మేడారంలో తప్పిపోయిన చిన్నారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగిస్తూ మానవీయతను చాటారు.
తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన మంత్రి సీతక్క
మేడారం జాతర పర్యటనలో రాష్ట్ర మంత్రి సీతక్క మానవత్వాన్ని చాటుకున్నారు. జంపన్న వాగు వద్ద జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సమయంలో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన ఒక చిన్నారిని గమనించిన మంత్రి వెంటనే స్పందించారు. చిన్నారిని తన చేతుల్లోకి తీసుకున్న మంత్రి, ఆమె తల్లిదండ్రులను గుర్తించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తమై తక్షణమే చిన్నారి తల్లిదండ్రులను గుర్తించారు. అనంతరం ఆ చిన్నారిని మంత్రి సీతక్క స్వయంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటన అక్కడున్న భక్తులను ఎంతగానో కదిలించింది.
భక్తులకు మంత్రి సూచనలు
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మేడారం జాతరలో చిన్నపిల్లలు, వృద్ధులను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. ఎవరినీ ఒంటరిగా వదిలివేయకూడదని, ఎవరైనా తప్పిపోయినట్లయితే వెంటనే సమీపంలోని యూనిఫాం ధరించిన పోలీస్ సిబ్బందిని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
మిస్సింగ్ క్యాంపుల ఏర్పాటు
జాతరలో తప్పిపోయిన వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా ‘మిస్సింగ్ క్యాంపులు’ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ క్యాంపుల ద్వారా తప్పిపోయిన వారిని త్వరితగతిన గుర్తించి వారి కుటుంబ సభ్యులకు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. భక్తుల భద్రతే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యమని, అందరూ సహకరించి జాతరను సురక్షితంగా నిర్వహించుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.