28-05-2025 12:00:00 AM
మహబూబాబాద్, మే 27 (విజయ క్రాంతి): తొలకరి వర్షాలకు ముందే మహబూబాబాద్ జిల్లాలో వానాకాలం సాగు కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. గత వారం రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలతో భూములను దుక్కి చేసి, పత్తి విత్తనం వేయడానికి అనువుగా ‘అచ్చు’ చేస్తున్నారు.
రోహిణి కాలంలో విత్తనం చేస్తే మంచి పంట పండుతుందని, ఈసారి తొలకరికి ముందే రోహిణి కార్తె లోనే విత్తనం వేసేందుకు అవకాశం ఉందని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామానికి చెందిన గుండెల యాకయ్య అనే రైతు చెప్పాడు. విత్తనాలను కూడా తెచ్చి పెట్టుకున్నానని, ఇప్పటికే దుక్కి దున్ని ‘అచ్చు’ చేస్తున్నానని, ఇక వర్షం పడితే విత్తనం నాటుతానని చెప్పాడు.