calender_icon.png 8 June, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికటించిన ఆర్‌ఎంపీ వైద్యం

28-05-2025 12:00:00 AM

  1. పోలీసులకు ఫిర్యాదు, నెక్కొండలో తెలంగాణ వైద్య మండలి బృందం తనిఖీలు

ఆర్.ఎం.పీ లపై పోలీసులకు ఫిర్యాదు

వరంగల్ (మహబూబాబాద్) మే 27(విజయ క్రాంతి): వచ్చిరాని వైద్యం చేసి ఓ వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చిన ఘటనలో తెలంగాణ వైద్య మండలి, పోలీసులు వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో తనిఖీలు నిర్వహించి మిడిమిడి వైద్యం చేసి ప్రాణాపాయ స్థితికి తెచ్చిన ఫస్ట్ ఎయిడ్ నిర్వాహకుడిపై క్రిమినల్ చర్యలకు సిఫారసు చేశారు.

నెక్కొండ మండలం చెరువు ముందు తండాకు చెందిన అజ్మీర తులసియా అనే రైతు గత ఏడాది ఏప్రిల్ 7న వ్యవసాయ పనులకు వెళ్లి ఒళ్ళు నొప్పులకు గురికాగా స్థానికంగా ఉన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కు చెందిన బర్మావత్ మోహన్ వద్దకు వెళ్లగా, మోహన్ తులసియ ఒళ్ళు నొప్పులు తగ్గుతాయని తుంటికి ఒక ఇంజక్షన్ వేశాడు. అనంతరం ఇంటికి వెళ్లిన తులసియాకు జ్వరం రావడంతో పాటు ఇంజక్షన్ వేసిన చోట గడ్డ కట్టింది.

మళ్లీ మోహన్ వద్దకు వెళ్లి చెప్పగా సెలెన్ బాటిల్ పెట్టి గడ్డ కట్టిన చోట నొప్పి తగ్గడానికి గడ్డ ఉన్న ప్రదేశంలో రకరకాల ఇంజక్షన్లు ఇవ్వడం, స్లున్ పెట్టి చికిత్స చేయడంతో సమస్య మరింత జటిలంగా మారింది. వెంటనే అదే నెల 12న నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తులసియ ను తీసుకువెళ్లగా, ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని గుర్తించిన డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించి తుంటి, తొడ, కాలుకు సోకిన ఇన్ఫెక్షన్ తొలగించి, చికిత్స చేయడంతో  కొద్ది రోజులకు గాయం కొద్దిగా తగ్గడంతో డిశ్చార్జి చేశారని చెప్పారు.

అయితే ఆ తర్వాత కూడా ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకపోవడంతో మరోసారి తొర్రూర్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చూపించగా అక్కడ కూడా మరోసారి ఆపరేషన్ నిర్వహించి మందులు ఇవ్వడంతో తన భర్త ఆరోగ్యం కుదుటపడిందన్నారు. ఆర్.ఎం.పి వైద్యుడు వచ్చిరాని వైద్యం వల్ల వైద్యం వికటించి తన భర్త కాలు సెప్టిక్ వల్ల నరకం చూసాడని, చావు అంచుల వరకు వెళ్లి బతికాడని, తన భర్తను ఇబ్బందులకు గురిచేసిన ఆర్.ఎం.పి ధర్మవత్ మోహన్ పై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య బుజ్జి నెక్కొండ పోలీసులకు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కు  ఫిర్యాదు చేశారు.

దీనితో నెక్కొండ పోలీసులు మోహన్ పై కేసు నమోదు చేసి వరంగల్ జిల్లా తెలంగాణ వైద్య మండలికి సమాచారం ఇవ్వడంతో వైద్య మండలి సభ్యులు సోమవారం సాయంత్రం గ్రామానికి చేరుకొని విచారణ నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా వైద్యశాలలు ఏర్పాటు చేసి అర్హత లేకుండా చికిత్స చేస్తున్నట్లు గుర్తించారు. బర్మావత్ మోహన్ తో పాటు,

సూరిపల్లి గ్రామంలో మహేశ్వరా క్లినిక్ నిర్వాహకులు ఎం. రమేష్, నెక్కొండ రైల్వే స్టేషన్ ఎదురుగా లావణ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకులు ఎం.రమేష్, అమ్మ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకులు డి. అశోక్, రుద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు బి.రవి నిబంధనలకు విరుద్ధంగా బెడ్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్ నిర్వహిస్తూ ఇంజక్షన్లు చేస్తున్నట్లు గుర్తించారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైద్యులపై టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి.నరేష్ కుమార్, వరంగల్ జిల్లా హెచ్‌ఆర్డిఏ అధ్యక్షులు, ఐఎంఏ యాంటీ క్రోకరి కమిటీ సెక్రటరీ డాక్టర్ వెంకటస్వామి, నెక్కొండ సబ్ ఇన్స్పెక్టర్ మహేందర్ చర్యలకు ఉపక్రమించారు.