27-06-2025 02:10:36 AM
ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, కలెక్టర్ బీఎం.సంతోష్
గద్వాల, జూన్ 26 (విజయక్రాంతి); ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటి మంజూరు పొందిన లబ్ధిదారులు నెల రోజుల్లో నిర్మాణం ప్రారంభించి,ఏడాది లోపు పూర్తి చేసుకొని స్వంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సంతోష్ లు సూచించారు.గురువారం మల్దకల్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఉత్తర్వులు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులు స్వీకరించబడినట్లు అధికారులు తెలిపారు.జోగులాంబ గద్వాల జిల్లా నుంచి వచ్చిన 1.5 లక్షల దరఖాస్తుల్లో,ప్రతి దానిని నిర్ధిష్టంగా వెరిఫై చేసి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతోందని తెలిపారు. తక్కువ ఖర్చుతో నిర్మాణ విధానంపై పూర్తి అవగాహనను హౌసింగ్ అధికారులు అందించనున్నారని ,డబ్బులు ఎవరికీ ఇవ్వనవసరం లేదని స్పష్టం చేశారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తక్షణమే ప్రారంభించి ఒక సంవత్సరంలోపు పూర్తి చేసుకోవాలని అన్నారు.
రైతుల పంటల కోసం అవసరమైన విత్తనాలు,ఎరువులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.జిల్లా రైతు భరోసా కేంద్రానికి రూ.250 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సంగీత లక్ష్మి,స్థానిక ప్రజా ప్రతినిధులు,లబ్ధిదారులు,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.