01-11-2025 04:28:14 PM
14 నెలల్లో 1200 డెలివరీలు
వీటిలో సహజ కాన్పులు 349
గత నెల అక్టోబర్లో 105 డెలివరీలు
వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెంచలయ్య మాట్లాడారు. దవాఖానలో గత నెల అక్టోబర్లో 105 కాన్పులు జరిగాయని, గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు 1200 కాన్పులు జరగగా, అందులో 349 సాధారణ కాన్పులు ఉన్నాయని వెల్లడించారు. గైనకాలజిస్ట్ డాక్టర్లు, మత్తు వైద్యులను, కాన్పుల వార్డు సిబ్బందిని, పిల్లల వైద్యులను సన్మానించి అభినందనలు తెలిపారు.
వైద్యులు లేని సమయంలో గైనిక్ వైద్యులను కేటాయించి సహకరించిన జిల్లా కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆసుపత్రి అభివృద్ధికి సహకరిస్తున్న కమిటీ చైర్మన్ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆసుపత్రి కి అవసరం అయిన దాదాపు కోటి ఎనభై లక్షల రూపాయలు విలువ చేసే పరికరాలు అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దవాఖానలో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య పిలుపు ఇచ్చారు.