ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి
కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి: వివిధ అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం సాయంత్రం బెల్లంపల్లి మండల కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందుల విలువలు, రిజిస్టర్లు, ల్యాబ్, రోగులకు అందిస్తున్న సౌకర్యాలు, ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న గర్భిణుల వివరాలు, పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే వారితో స్నేహపూర్వకంగా మెదలాలని, గర్భిణులు తప్పనిసరిగా ఆసుపత్రులలోనే ప్రసవాలు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కాసిపేట మండల కేంద్రంలోని కేజీబీవీని సందర్శించి కొనసాగుతున్న అదనపు గదులు, భోజనశాల, మూత్రశాలల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వంటశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం తయారీకి వినియోగించే నిత్యవసర సరుకుల నాణ్యతను పరిశీలించి ఆహారం తయారీ సమయంలో శుభ్రత నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.






