19-07-2025 12:00:00 AM
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్ జూలై 18:(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్ కళాశాలలను శుక్రవారం బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో సమావేశమై, ఒక్కో విభాగం వారీగా నమోదైన ఫలితాలను, అధ్యాపకుల ఖాళీలు, అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలను సమీక్షించారు.
అనంతరం తరగతి గదులు, వర్క్ షాప్ లను సందర్శించి, పనితీరును పరిశీలించారు. విద్యార్థిని, విద్యార్థులతో భేటీ అయ్యి, వారికి అందిస్తున్న శిక్షణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. మెకానికల్, సివిల్స్ తదితర వర్క్ షాప్ లలో యంత్ర పరికరాల పనితీరు గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దోహదపడేలా విద్యార్థులకు నాణ్యతతో కూడిన శిక్షణ అందించాలని హితవు పలికారు.
సాంకేతిక విద్యాభివృ ద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా బోధనా సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో కేవలం ఉత్తీర్ణత సాధిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రతిభను కొలమానంగా గుర్తిస్తూ ఆయా సంస్థలు ఉపాధి కల్పిస్తున్నాయని గుర్తు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షలలో సైతం నెగ్గుకురావాలంటే అత్యుత్తమ ప్రతిభను చాటాల్సిన ఆవశ్యకత నెలకొని ఉందన్నారు. ఫలితాల సాధనపై సమీక్ష జరుపుతానని కలెక్టర్ స్పష్టం చేశారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్, బోధనా సిబ్బంది ఉన్నారు.