23-05-2025 12:39:32 AM
నిజామాబాద్, మే 22 (విజయ క్రాంతి) : దళిత మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ఎం.భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని ప్రధాన సమావేశ మందిరంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి అదనపు కలెక్టర్ అంకిత్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ, దళితుల అభ్యున్నతికి దళిత మహిళల విద్యార్జన కోసం భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. భాగ్యరెడ్డి వర్మ 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని ఆయన సేవలను కొనియాడారు. భాగ్యరెడ్డి వర్మ జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
మహనీయులను గౌరవించుకోవడంతో పాటు వారి స్పూర్తితో సమాజ హితం కోసం ముందుకు సాగేందుకు ఈ వేడుకలు దోహదపడతాయని అన్నారు. భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిణి నిర్మల, వివిధ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డిలో..
దళిత మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ఎం.భాగ్యరెడ్డి వర్మ లో ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు.
కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రధాన సమావేశ మందిరంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి అదనపు కలెక్టర్ విక్టర్, చందర్ నాయక్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిణి ప్రమీల, కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి గిరిధర్, టి పి ఎస్ అధికారులు కావ్య, సాయి వివిధ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.