16 July, 2026 | 4:40 PM

గుడ్ న్యూస్ చెప్పిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

03-07-2024 04:28 PM

హైదరాబాద్: అనుకున్న సమయం కంటే ముందు గ్యారంటీలు అమలు చేశామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఐదేళ్లలో కూడా గత ప్రభుత్వం చేయలేదు కానీ.. రుణమాఫీ ఎప్పుడు చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నారని భట్టి మండిపడ్డారు. రైతుబంధును రైతు భరోసాగా మార్చామన్న భట్టివిక్రమార్క ప్రజలు కట్టిన పన్నులతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు కట్టిన ప్రతీ పైసా రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడాలన్నారు.

ప్రజల అభిప్రాయాలు తీసుకుని రైతు భరోసా, రైతురుణమాఫీ పథకాలపై విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు. ప్రజల అభిప్రాయం ప్రకారమే ఎవరికి పథకాలు ఇవ్వాలి.. దేనికి ఖర్చు పెట్టాలో నిర్ణయిస్తామని వెల్లడించారు. అన్ని వర్గాలలో మట్లాడి వచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్య ఘటనపై విచారణకు ఆదేశించామన్న భట్టి రైతు ఆత్మహత్య వెనక ఎవరు ఉన్నా ఉపేక్షించమని డిప్యూటీ సీఎం హెచ్చరించారు.