జగన్ కేసులను రోజువారీ విచారణకు ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్ : వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేసుల పిటిషన్ పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. జగన్ కేసులపై గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సీబీఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీ విచారణకు కోర్టు ఆదేశించింది. జగన్ తరుపు న్యాయవాదికి ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణను జూలై 23వ తేదీకి వాయిదా వేసింది. 2019 ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి విచారణకు హాజరుకాగా.. తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆయన కోర్టుకు హాజరయ్యే విషయంలో మినహాయింపు కోరారు. ఇప్పుడు సీఎం పదవి కోల్పోయిన జగన్ కోర్టుకు హాజరవుతారా లేదా అనేది చూడాలి.






