07-01-2026 12:34:09 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కొత్త ఫార్మా కంపెనీ(New pharma company) ఏర్పాటు కోసం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచే పట్టణంలోని అన్ని వాణిజ్య వ్యాపార సంస్థలు, టిఫిన్ సెంటర్లు, టీ పాయింట్లు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ కార్యాలయాలను అఖిలపక్షం నాయకులు మూసివేయించారు.
అలాగే పట్టణంలోని పెట్రోల్ బంకులు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసివేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా సీఐ సంపత్ కుమార్, ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. భిక్కనూరు బంద్కు మద్దతుగా బస్వాపూర్, పెద్ద మల్లారెడ్డి, కాచాపూర్, కంచర్ల గ్రామాలతో పాటు పలు గ్రామాలు కూడా బంద్ పాటిస్తున్నాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలు ఫ్యూజన్ హెల్త్ ఫార్మా కంపెనీ వద్ద నిర్వహిస్తున్న పబ్లిక్ హియరింగ్ కార్యక్రమానికి తరలివెళ్లారు.