calender_icon.png 18 February, 2026 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి

17-02-2026 12:00:00 AM

మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

తుంగతుర్తి, ఫిబ్రవరి 16: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని, మున్సిపల్ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకల్లు జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం తిరుమలగిరి మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కూడా అధికార పార్టీకి అనుకూలంగా పని చేసిందన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో విషయంలో ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వివరించడం వింతగా ఉందన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో తప్పకుండా బీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలు కేసీఆర్ ని కోరుకుంటున్నారని దానికి నిదర్శనంగానే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపొందామన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తిరుమలగిరిలో మున్సిపల్ ఓటమి కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటి సమాధానమన్నారు. కాంగ్రెస్ పార్టీ మాయ హామీలతో గెలిచిందని ఇప్పుడు ఎన్నికలు పెట్టిన మళ్లీ కేసీఆర్ ని కోరుకుంటున్నారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే కేసులతో ఒరిగేదేమీ లేదనీ, రాష్ట్రవ్యాప్తంగా అన్ని దాడులను  సహించి తట్టుకుని నిలబడి పనిచేస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తదుపరి నూతనంగా ఎంపికైన మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి వైస్ చైర్మన్ ఏబోజు గోవిందమ్మలను అభినందించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, గుజ్జ యుగంధర్ రావు, కల్లెట్లపల్లి శోభన్ , కొమ్మినేని సతీష్, కల్లెట్లపల్లి ఉప్పలయ్య  నాయకులు పాల్గొన్నారు.