11 May, 2026 | 1:33 AM

ప్రధాని సభకు భారీగా తరలిన బీజేపీ శ్రేణులు

11-05-2026 12:00 AM

వాహనశ్రేణిని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

ముకరంపుర, మే 10(విజయ క్రాంతి) హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం నిర్వహించిన ప్రధాని మోదీ సభ కోసం కరీంనగర్ జిల్లా నుండి భారీ ఎత్తున బిజెపి శ్రేణులు తరలి వెళ్లారు. కరీంనగర్ నుండి సభ కోసం తరలి వెళ్లిన వాహనాలను బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు తొమ్మిది వేల కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోది రాష్ట్ర పర్యటనకు రావడం జరిగిందన్నారు.

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి  ప్రధానమంత్రి గా మూడో సారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో జనాగ్రహ సభ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి మోది హాజరయ్యే ఈ సభను ప్రతిష్టాత్మకంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించాలనే విధంగా రాష్ట్ర పార్టీ ఆలోచన చేసిందన్నారు.

తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసే లక్ష్యంతో , అశేష జన వాహినీ సభకు  తరలివచ్చే విధంగా ప్రయత్నాలు చేసిందన్నారు. ఆ దిశలోనే జిల్లా పార్టీ ఆధ్వర్యంలో సభకు భారీ ఎత్తున బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు 120 ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులతో పాటు దాదాపు 500 సొంత వాహనాల్లో సభకు తరలి వెళ్లారన్నారు. ప్రధాని మోదీ సభ తో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉందన్నారు.

సభ అనంతరం దక్షణ భారతదేశానికి తెలంగాణ కీలక మలుపు అవుతుందని, బిజెపి కి ప్రవేశ ద్వారంగా తెలంగాణ అయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్ళ రమేష్ ,ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం బిజెపి సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ పుప్పాల రఘు, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు