గురువింద గింజలా బీజేపీ చార్జిషీట్
- మోదీ 10 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?
- పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): బీజేపీ విడుదల చేసిన చార్జిషీట్ చూస్తుంటే గురివింద సామెత గుర్తొస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపైనా.. కేంద్రంలోని బీజేపీ 10 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమేనా అని ఆయన సవాల్ విసిరారు.
తమ ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చకు రెడీగా ఉన్నామని, పదేళ్ల బీజేపీ చీకటి పాలనపై చర్చిద్దామని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చి అప్రజాస్వామిక పాలన చేశారని మండిపడ్డారు.
దేశంలో 411 మంది ఎమ్మెల్యేలను వివిధ పార్టీలనుంచి బీజేపీలోకి చేర్చుకున్నారని ఆరోపించారు. మతతత్వ రాజకీయాలు చేస్తూ.. పార్టీలను చీలుస్తూ రాజకీయ పబ్బం గడిపిన బీజేపీ ఇప్పుడు సుద్ధపూస మాటలు మాట్లాడుతోందని విమర్శించారు. బీజేపీ 2014, 2019, 2024 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను తీస్కొని రావాలని, 2023లో ఇచ్చిన కాంగ్రెస్ మ్యానిఫెస్టోను తీసుకుని తాము వస్తామన్నారు.
రాష్ర్టంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని తేలిపోవడంతో బీజేపీ ప్రతిష్ట పూర్తిగా దిగజరిపోయిందన్నారు. ఇప్పుడు రాష్ర్టంలో చార్జిషీట్ అంటూ కొత్త రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. ప్రధాని మోడీ చీవాట్లు పెట్టడంతో చార్జిషీట్ అంటూ హడావిడి చేస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ కవల పిల్లలు అని, ఒకరికొకరు ఒకరికొకరు ఏ టీం, బీ టీంగా వ్యవహరిస్తున్న అంశం అనేకసార్లు రుజువైందని చెప్పారు.
-కేంద్రం ఈ పదేళ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. -రైతుల సంక్షేమం కోసం దాదాపు రూ. 54 వేల కోట్లు ఖర్చు చేసింది బీజేపీ నాయకులకు కనిపించడం లేదా అని నిలదీశారు. -ఢిల్లీలో రైతులపై అక్రమ కేసులు బనాయించిన ఘనత బీజేపీదని ఆరోపించారు.
-కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఉద్యోగాలను భర్తీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.21 వేల కోట్లతో రుణమాఫీ, రైతుపెట్టుబడికి రూ.7,600 కోట్లు, ధాన్యం కొనుగోళ్లకు రూ. 10,500 కోట్లు, 42 లక్షల మంది రైతులకు బీమా కోసం రూ. 1,400 కోట్లు, అకాల వర్షాలకు నష్టపోయిన 94వేల మంది రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇచ్చామని, ఇవన్నీ బీజేపీ నాయకులకు కనపడటం లేదా అని ఆయన ప్రశ్నించారు.




