తెలుగు భాషా సాహిత్యాన్ని ప్రచారం చేయాలి
మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఆచార్య సూర్య ధనుంజయ్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (విజయక్రాంతి): తెలుగు సాహిత్యాకాశంలో యువభారతి వెలుగు దివ్వెలు ధృవతారలుగా వెలుగుతున్నట్టు వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయ వైస్ఛాన్స్లర్ ఆచార్య సూర్య ధనుంజయ్ పేర్కొన్నారు. తెలుగు భాషా సాహిత్య ప్రచారానికి యువభారతి ఎంతో కృషి చేస్తోందని ఆమె తెలిపారు. యువభారతి, రసమయి సంస్థ, ఐఐఎంసీ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో ఐఐఎంసీ కాలేజీ ప్రాంగణంలో జరిగిన తెలుగు వెలుగు సమాఖ్య ద్వితీయ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజర య్యారు.
యువభారతి వ్యవస్థాపకులు ఆచార్య వంగపల్లి విశ్వనాథం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు వెలుగు సమాఖ్య కార్యక్రమాల కరపత్రాన్ని ఆచార్య సూర్య ధనుంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు సాహిత్య విద్యార్థినిగా తాను యువభారతిని దగ్గరగా చూశానని, ఆ సంస్థ అద్భుతమైన గ్రంథాలను ప్రచురించినట్టు తెలిపారు. అవధాన ప్రక్రియ గురించి మరుమాముల దత్తాత్రేయ శర్మ ప్రసంగించారు.
యువభారతి అధ్యక్షుడు ఆచార్య ఫణీంద్ర అధ్యక్షతన తెలుగు భాషా సాహిత్యాల వైభవం అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. యువభారతి కార్యదర్శి జీడిగుంట, ఐఐఎంసీ కళాశాల ప్రిన్స్పాల్ కే రఘువీర్, డాక్టర్ ఎస్ నారాయణరెడ్డి, అక్కిరాజు సుందర రామకృష్ణ, సత్కళాభారతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.




