25-01-2026 07:53:56 PM
బిజేపీ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్
జవహర్ నగర్,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్ బృందావనం కాలనీ నందు భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. జవహర్ నగర్ పరిసర ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చెయ్యాలని నూతన కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ అన్నారు. అందుబాటులో కార్యలయం ఉంటే ప్రజలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంపెల్లి మోహన్ రెడ్డి హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే జవహర్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ కుతాడి శ్రీనివాస్ ప్రత్యేక అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని మరింత విశేషంగా తీర్చిదిద్దారు.కొంపల్లి మోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యాలయం కేంద్ర బిందువుగా మారుతుందని తెలిపారు.
కార్యకర్తలు ప్రజలతో నేరుగా అనుసంధానం కావడానికి, స్థానిక సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బీజేపీ కార్యకర్తలు, వివిధ కాలనీల కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యకర్తల ఉత్సాహం, ప్రజల హాజరు పార్టీపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. రానున్న రోజుల్లో జవహర్ నగర్ ప్రాంతంలో బీజేపీ మరింత శక్తివంతంగా ఎదుగుతుందనే ఆశాభావం ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తమైంది.