04-08-2025 04:06:30 PM
ట్రంప్ పెత్తనాన్ని ప్రశ్నించలేకపోతున్న మోడీ
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): దేశంలో బిజెపి కోట్ల సంఖ్యలో ఓట్లను తొలగించే కుట్రను చేస్తుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆ రాష్ట్రంలో బిజెపి 65 లక్షల ఓట్లను తొలగించడం దారుణం అన్నారు. సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపినా మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం మైనార్టీ ఓట్లను అక్రమంగా తొలగిస్తుందని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధంగా ముస్లిం ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు.
పాకిస్తాన్ తో జరిగిన యుద్దాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చెబుతున్నా ప్రధాని మోడీ ఎందుకు ఖండించడం లేదని తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. అమెరికా మన మిత్ర దేశమని మోడీ పదేపదే ప్రకటనలు గుప్పిస్తున్నా ట్రంప్ మాత్రం భారతదేశంపై ద్వేషాన్ని కక్కుతూనే ఉన్నాడని ఆరోపించారు. భారతదేశ ఎగుమతులపై అమెరికా 25% సుంకాన్ని విధించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుందన్నారు. పాకిస్తాన్ దేశానికి చెందిన అనీష్ మునీర్ ను ట్రంప్ తన ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వడం చూస్తుంటే ట్రంప్ ఈ దేశానికి ఎలా మేలు చేస్తాడని నమ్మాలని ఆయన ప్రశ్నించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సిపిఎం పార్టీ కట్టుబడి ఉంది అని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.