24-07-2025 01:32:04 AM
ముస్లిం రిజర్వేషన్ల సాకుతో బీసీ రిజర్వేషన్లకు మోకాలడ్డు
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేష న్లతోనే తెలంగాణలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు సైతం సెప్టెంబరు నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిందన్నారు. ముస్లిం రిజర్వేషన్ల సాకుతో బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మోకాలడ్డుతోందని, బీజేపీ నాయకత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.
ఆ పార్టీ నేతలు 42శాతం రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి..ఇప్పుడు మాటమార్చి ముస్లింల శాతాన్ని తీసివేయాలంటున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత యూపీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లను ముందుగా తొలగించి తెలంగాణ గురించి మాట్లాడాలని హితువు పలికారు. కేంద్ర పదవుల్లో తెలంగాణకు, బీసీలకు అన్యాయం జరుగు తోందని, గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేతను తొలగించారని, ఆ తర్వాత దత్తాత్రేయను గవర్నర్ పదవి నుంచి తొలగించారని ఆరోపించారు.
బీసీ అయిన దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణనపై కాంగ్రెస్ ఎంపీలకు ఢిల్లీలో గురువారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చెప్పా రు. బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్రెడ్డి విలేకరులతో మాట్లాడారు.. బీసీలకు విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ పూర్తిస్థాయి లో చర్చించి ఆమోదించిన రెండు బిల్లులను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రెండు బిల్లుల ఆమోదానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేలను గురువారం ఉదయం కలిసి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే (ఎస్ఈఈఈపీసీ) జరిపిన తీరు, రాష్ర్ట ప్రభుత్వం అను సరించిన విధానాలను వివరిస్తామని తెలిపా రు.
ఈ సమావేశాల్లోనే తెలంగాణ ప్రభుత్వం చేసిన రెండు బిల్లుల ఆమోదానికి పట్టుపడతామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభలో బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, ఎంఐఎం మద్దతు పలికాయని సీఎం గుర్తుచేశారు.
ముస్లింలను సాకుగా చూపుతోంది..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, సంజయ్ ముస్లింలను సాకుగా చూపుతున్నారని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, నేతలు వితం డవాదం చేస్తున్నారని, బీజేపీకి, కాంగ్రెస్కు వేర్వేరు రాజ్యాంగాలు లేవన్నారు. ప్రధాని సొంత రాష్ర్టం గుజరాత్, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ర్టలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని..బీజేపీ నేతలకు దమ్ముంటే ఆ రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించాలని సీఎం సవాల్ విసిరారు.
గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని..ఇక ముం దు అమలు చేస్తామని హోంశాఖ మంత్రి అమిత్షా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, బీజేపీ నేతలు అందుకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. మొండిగా ఉంటే రైతు చట్టాల సమయంలో పట్టినగతే మళ్లీ పడుతుందని విమర్శించారు.
బీజేపీ మెడలు వంచైనా బీసీలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు పిచ్చోళ్లని, వాళ్ల గురించి మాట్లాడడం దండగన్నారు. స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే విషయాన్ని తీవ్రంగానే పరిశీలిస్తున్నామని మరో ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి బదులిచ్చారు.
3.99 శాతం ప్రజలు తమకు ఏ కులం లేదన్నారు..
తెలంగాణలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజకీయ కుల సర్వే ప్రక్రియను 2024, ఫిబ్రవరి 4న మొదలు పెట్టి 2025, ఫిబ్రవరి 4వ తేదీ నాటికి పూర్తి చేసి శాసనసభలోనూ ఆమోదించామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. సర్వే వివరాలను శాసనసభ ముం దుంచామని..దాని ప్రకారం 56.4 శాతం బీసీలు, 17.45 శాతం ఎస్సీలు, 10.08 శాతం ఎస్టీలు, 10.09 శాతం ఉన్నత వర్గాల వారు ఉన్నారని చెప్పారు.
తెలంగాణలో 3.09 శాతం మంది తాము ఏ కులానికి చెందమని ప్రకటించారని.. తెలంగాణలో ఇదో కొత్త పరిణామమని అన్నారు. సర్వే వివరాలను స్వతం త్ర నిపుణుల సలహా కమిటీకి ఇచ్చామని, వారు దానిపై చర్చించి నివేదికను రాష్ర్ట ప్రభుత్వానికి సమర్పించారని తెలిపారు. ఆ నివేదిక ను మంత్రివర్గంలో చర్చించి శాసనసభలో ప్రవేశపెడతామని వెల్లడించారు. సర్వే చేసినప్పటికీ వ్యక్తిగత వివరాలు వెల్లడించకూద ని..అది వ్యక్తిగత డేటా ప్రైవసీ యాక్ట్కు విరుద్ధమని సీఎం ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
50 శాతం రిజర్వేషన్ల పరిమితి పక్కకు..
కులగణన విషయంలో తెలంగాణ ప్రభు త్వం దేశానికి రోల్మోడల్గా నిలిచిందని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. తెలంగాణ వేసిన రోడ్మ్యాప్ను దేశవ్యాప్తంగా కులగణన సేకరణకు కేంద్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని సీఎం సూచించారు. రాబోయే 2029 లోక్సభ ఎన్నికలు ఓబీసీ రిజర్వేషన్లకు లిట్మస్ టెస్ట్గా నిలుస్తాయని సీఎం ప్రకటించారు. ఈడబ్ల్యూఎస్కు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతోనే 50 శాతం రిజర్వేషన్ల పరిమితి అంశం పక్కకుపోయిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
ఒక్కరోజులోనే బీజేపీ మాట వినద ని, బీజేపీ మొండి, తొండి వాదనలు చేస్తోంద ని మండిపడ్డారు. సమావేశంలో రాష్ర్ట ప్రభు త్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కార వేణుగోపాలరావు, ఎంపీలు మల్లు రవి, చామల, రఘురామిరెడ్డి, బలరాం నాయ క్, రఘువీర్రెడ్డి, వంశీకృష్ణ, కావ్య, సురేశ్ షెట్కా ర్, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నా రు.
ఉపరాష్ట్రపతి పదవి దత్తన్నకు ఇవ్వాలి
ఉప రాష్ర్టపతి జగ్దీప్ ధన్ఖడ్ రాజీనామాకు కారణాలేమిటో తన కు తెలియదని, కానీ ఆ రాజీనామా దురదృష్టకరమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఉప రాష్ర్టపతి పదవిని ఈదఫా తెలంగాణకు ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఉప రాష్ర్టపతిగా ఉన్న తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడును రాష్ర్టపతి కాకుండా ఇంటికి పంపించారని, సికింద్రాబాద్ నుంచి గెలిచి కేంద్రమంత్రిగా ఉన్న బీసీ నేత దత్తాత్రే యను గవర్నర్గా పంపి ఆ పదవిని కిషన్రెడ్డికి ఇచ్చారన్నారు.
బీసీ నేత గా ఉన్న బండి సంజయ్ను బీజేపీ రాష్ర్ట అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్రెడ్డికి, ఆయన తర్వాత రాంచందర్రావుకు ఇచ్చారని, బీజే పీ బీసీలకు అన్యాయం చేసిందని సీఎం విమర్శించారు. దత్తాత్రేయ గవర్నర్ పదవి కాలం కూడా ముగిసిపోయిందన్నారు.
తెలంగాణలోని బీసీలకు చేసిన ఈ అన్యాయాన్ని సరిచేసుకునేందుకు దత్తాత్రేయకు ఉప రాష్ర్టపతి పదవి ఇస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. అయితే ఉప రాష్ర్టపతి ఎన్నికలో అంతిమ నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానానిదేనని, తనను అవకాశం ఉంటే దత్తాత్రేయకు మద్దతు ఇచ్చే విషయంలో మాట్లాడే ప్రయత్నం చేస్తానని సీఎం ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.