01-02-2026 06:55:30 PM
25 సంవత్సరాలు ఆ పార్టీకి ఊడిగం చేశా: కొండా నర్సింగరావు
శామీర్ పేట్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన వారికి అన్యాయం జరుగుతుందని కొండ నర్సింగరావు ఆరోపించారు. ఆదివారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తామన్న మాటలతో, సామాజిక సమానత్వమే తమ పాలన లక్ష్యమని చెబుతూ బీసీల విశ్వాసాన్ని కాంగ్రెస్ సంపాదించింది. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మాటలు క్రమంగా మౌనంగా మారాయి.
హామీల స్థానంలో మౌనం, ఆశల స్థానంలో నిరాశ, నమ్మకం స్థానంలో అనుమానం బలపడిందన్నారు. ఈ పార్టీలో కేవలం అగ్రకులాలకు చెందిన వారిదే పెత్తనం నడుస్తుందని అన్నారు. 25 సంవత్సరాలు పార్టీ కోసం పని చేశా అయినా పార్టీలో గుర్తింపు దక్కలేదు అందుకోసమే బిజెపి కండువా కప్పుకున్న అని కొండా నర్సింగరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుద్ధి శ్రీనివాస్, గోనె శ్రీనివాస్, నంద్యాల శ్రీనివాస్ , వెంకటేష్ నాయక్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.