15-10-2025 01:11:33 AM
మిగిలిన 30 స్థానాలకు త్వరలో మరోజాబితా
న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మంగళవారం బీజేపీ అధిష్ఠానం తొలిజాబితా విడుదల చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 71 స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ప్రకటించింది. ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ తారాపుర్ నుంచి, మరో డిప్యూటీ సీఎం విజయ్కుమార్ సిన్హా లఖిసరాయ్ నుంచి బరిలో దిగనున్నారు. ఈ ఎన్నికల్లో మంత్రులు నితిన్ నబీన్ బాంకీపుర్ నుంచి, రేణుదేవి భేతియా నుంచి, మంగల్పాండే సీవాస్ నుంచి తమతమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
బీహార్ అసెంబ్లీ స్థానాలు మొత్తం 243 ఉండగా 101 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. మిగతా 30 మందితో మరో జాబితా విడుదల చేయాల్సి ఉంది. ఈ మేరకు ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇటీవల ఖరారైంది.
మొత్తం 243 స్థానాల్లో ఎన్డీయే కూటమైన జేడీయూ101, బీజేపీ 101, లోక్జనశక్తి పార్టీ 29, హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) 6, రాష్ట్రీయ లోక్మోర్చా (ఆర్ఎల్ఎం) 6 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎక్కడి నుంచి ఏ పార్టీ పోటీ చేయాలనే చర్చలు తుదిదశకు చేరినట్లు ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ తెలిపారు. బీహార్లో నవంబర్ 6, 11వ తేదీల్లో రెండు విడుతలుగా పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ చేపట్టనున్నారు.