calender_icon.png 20 June, 2025 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బనకచకర్ల’పై బీజేపీ తర్జన భర్జన

20-06-2025 01:16:16 AM

  1. ప్రాజెక్ట్ నిర్మించి తీరుతామంటున్న ఏపీ ప్రభుత్వం 
  2. అక్కడి ప్రభుత్వానికి భాగస్వామిగా ‘కమలం’
  3. క్యాడర్ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించలేదు..
  4. తెలంగాణ ప్రజల వ్యతిరేకతకు భయపడి మద్దతూ ఇవ్వలేదు..
  5. ఆచి తూచి అడుగులు వేస్తున్న కమలనాథులు

హైదరాబాద్, జూన్19 (విజయక్రాంతి): గోదావరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం బనకచర్ల ప్రాజెక్టు వివాదం బీజేపీకి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్నట్లు పరిణమించింది. అటు ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ.. ఇటు తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసి, అధికార పగ్గాలు చేబూనాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నది.

బనకచర్ల ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తే  ఎన్డీఏలో భాగస్వామి అయిన  టీడీపీ ప్రభ్వుత్వాన్ని వ్యతిరేకించినట్లవుతుంది. వ్యతిరేకించకపోతే తెలంగాణ ప్రజల్లో బీజేపీకి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అందుకే పార్టీ అధిష్ఠానం బనకచర్ల విషయంలో ఒక విధానపరమైన నిర్ణయమేదీ తీసుకోలేకపోతున్నదనేది సుస్పష్టం.

కానీ, తెలంగాణకు చెందిన కొంత పార్టీ క్యాడర్ మాత్రం పార్టీ ప్రాజెక్టును వ్యతిరేకించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఏపీలోని ఆ పార్టీ క్యాడర్ ప్రాజెక్ట్‌కు అనుకూలంగా ఉంది. ఇలాంటి సున్నితమైన సందర్భంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

అఖిలపక్ష సమావేశానికి బీజేపీ ఎంపీలు..

బనకచర్ల ప్రాజెక్‌పై ఇటీవల పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు విషయంలో రెండు రాష్ట్రాలకు న్యాయం చేసే నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. మరోవైపు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించారు.

గతంలో ఏనాడూ ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశాలకు హాజరు కాని బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ తాజా సమావేశానికి హాజరయ్యారు. తద్వారా తమకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమనే సంకేతాలు ఇచ్చారు. వీరు ప్రాజెక్ట్‌పై ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోవటం గమనార్హం. కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకే సదరు ఎంపీలు హాజరయ్యారనేది వేరే చెప్పనక్కర్లేదు.

మరో విశేషం ఏమిటంటే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమవడానికి గంట ముందే.. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌ను మర్యాద పూర్వకంగా కలవడం చర్చనీయాంశమైంది. భేటీ తర్వాత బనకచర్లపై రెండు రాష్ట్రాలకు న్యాయం చేసేలా కేంద్ర నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి పాటిల్ హామీ ఇచ్చారని కిషన్‌రెడ్డి ప్రకటించడం విశేషం.

ఈ పరిణామాలు బట్టి చూస్తే బీజేపీ అత్యంత సున్నితంగా బనకచర్ల వివాదంలో చిక్కుకోకుండా పావులు కదుపుతున్నదని అర్థమవతుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం బనకచర్ల అంశాన్ని కేంద్రంపై నెట్టివేసేందుకు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నది.

ఈ విషయంలో బీఆర్‌ఎస్ కూడా రాజకీయ మైలేజీ కోసం ప్రయత్నిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తనం వల్లే ఏపీలో బనకచర్ల ప్రాజెక్ట్‌కు అడుగులు పడుతున్నాయని, బీజేపీ కూడా ప్రాజెక్ట్‌ను అడ్డుకలేకపోతున్నదని.. ఒకేసారి రెండు పార్టీలను టార్గెట్ చేస్తున్నదంటున్నారు.