హైదరాబాద్ సంస్కృతిని చాటేలా బోనాలు
నిర్వహణకు రూ.20కోట్లు
జూలై 8 నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు
సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి): హైదరాబాద్ సంస్కృతీ సంప్రదాయాలను యావత్ ప్రపంచానికి చాటేలా బోనాలు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20కోట్లు మంజూరు చేసిందన్నారు. మంగళవారం హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో నిర్వహించనున్న ఉత్సవాలపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అమ్మవారి కల్యాణం, రథోత్సవ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా పక్కాగా ఉండాలన్నారు. వీక్షించేందుకు కిలోమీటర్ మేర భక్తులు ఉత్సవాలు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ మన్మంతరావు, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్కుమార్ పాల్గొన్నారు.






