ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం
మేడిపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అల్పాహార పథకం శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మేడిపల్లి ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎల్. సత్యప్రసాద్ తమ పాఠశాలలో అల్పాహార పథకం అమలును, విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం నాణ్యత, పరిశుభ్రత, వడ్డింపు విధానాన్ని పరిశీలించారు.
అనంతరం ఎంపీపీఎస్ మేడిపల్లి, ఎంపీపీఎస్ కమలానగర్ పాఠశాలల్లో అల్పాహార పథకం అమలును పర్యవేక్షించి అవసరమైన సూచనలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలను విస్తరించి అమలు చేయడం విశేషం అన్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందడంతో పాటు వారి ఆరోగ్యం, హాజరు శాతం, విద్యా ప్రగతి మరింత మెరుగుపడనున్నదని ప్రధానోపాధ్యాయులు ఎల్. సత్యప్రసాద్ తెలిపారు.






