19-06-2025 05:15:02 PM
పథకంలో చేరేందుకు నేతన్నలకు గడువు పొడిగింపు..
నల్గొండ టౌన్ (విజయక్రాంతి): అర్హులైన ప్రతి పేద నేత కార్మికుని త్రిఫ్ట్ ఫండ్ పథకంలో చేరేందుకు నెల రోజుల పాటు గడువు పొడిగించాలని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్, సీనియర్ నాయకుడు రావుల శ్రీనివాస్ రెడ్డి, చెరుపల్లి జయప్రకాష్, గంజి రాజేందర్ జెల్ల శ్రీను, గంజి లక్ష్మీనారాయణ, మూఢ వేణు, మిర్యాల కిరణ్ ఆధ్వర్యంలో నల్గొండ జౌలీశాఖ సహాయ సంచాలకులు ద్వారక్ కి గురువారం వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) పద్మశాలి నేత కార్మికుల అభివృద్ధి కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణ నేతన్నల అభివృద్ధి పథకమైన త్రిఫ్ట్ ఫండ్ పథకం కొరకు దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగిసి పోతుందని, జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 వేల మంది పేద నేత కార్మికుల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని నెల రోజుల పాటు గడువు పెంచాలని, అదేవిధంగా నూతన బ్యాంకు ఎకౌంట్లు తీసుకునేందుకు బ్యాంకు వారి అనేక షరతులతో పేద కార్మికులు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని నాయకులు అన్నారు.
తమ పార్టీ విజ్ఞప్తిపై జిల్లా సహాయక సంచాలకులు ద్వారక్ సానుకూలంగా స్పందించారని మరో 10 రోజులపాటు గడువు పొడిగిస్తున్నట్లు మీడియా ముందు ప్రకటన చేశారని, ఇది నేత కార్మికుల విజయమని నాయకులు అభివర్ణించారు.ఈ సందర్భంగా ఏడి ద్వారక్ మాట్లాడుతూ... అర్హులైన ప్రతి పేద కార్మికున్ని త్రిఫ్ట్ ఫండ్ లో చేరేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, బ్యాంకు వారి సహకారంతో కార్మికులు నివాసం ఉండే ప్రాంతాలలోనే క్యాంపు ఏర్పాటు చేసి ప్రతి పేద కార్మికునికి నూతన అకౌంట్లు కూడా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, ఏ పేద కార్మికుడు కూడా నష్టపోకుండా న్యాయం చేస్తామని వారు అన్నారు.