30-06-2025 12:50:21 PM
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని(Pashamylaram Industrial Area) రసాయన పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులకు కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని ఒక రసాయన కర్మాగారంలో(Pashamailaram Chemical Factory) సోమవారం రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో సిగాచి పరిశ్రమలో 66 మంది కార్మికులున్నారు. వివిద ఆస్పత్రుల్లో 36 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. పేలుడు ప్రభావంతో కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు కారణంగా పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. దీని కారణంగా చాలా మంది కార్మికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. పేలుడు కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీవ్రమైన కాలుష్యం వారి ప్రాణాలకు ముప్పు కలిగించే అవకాశం ఉందని భయపడి పోలీసులు వారిని ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోవాలని కోరుతున్నారు. ఇంకా చాలా మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.